న్యూ ఢిల్లీ : రాజ్యసభ సభ్యులు ,సీనియర్ భారతీయ జనతాపార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్జైట్లీ (66) కన్ను మూసారు . ఆయన ఢిల్లీ లోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం 12.07 గంటలకు తుదిశ్వాస వదిలారు . గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వెంటిలేటర్పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో ఇవాళ మరణించారు . 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ భాజపా విజయ ఢంకా మోగించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలో ఆయన చేరలేదు. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న అనంతరం ఆయన కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. అయితే, ఇటీవల జైట్లీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఈ నెల 9న హుటాహుటిన ఎయిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాసవిడిచారు. ఈ నెల 10నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటెన్ విడుదల చేయని వైద్యులు ఈ రోజు మధ్యాహ్నం ఆయన మృతిచెందినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. అరుణ్ జైట్లీకి భార్య సంగీత, కుమార్తె సొనాలి జైట్లీభక్షి, కుమారుడు రోహన్ జైట్లీ ఉన్నారు.
అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం జరగనున్నాయి. ఈ మేరకు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు.
జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్ నుంచి ఆయన నివాసానికి తరలించారు. రాజకీయనాయకులు, ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని రేపు ఉదయం 10 గంటలకు భాజపా ప్రధాన కార్యాలయంలో ఉంచనున్నారు. మధ్యాహ్నం తర్వాత నిగమ్బోధ్ ఘాట్లో జైట్లీ అంతిమ సంస్కారాలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు జేపీ నడ్డా తెలిపారు.